భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి జరిమానా చెల్లించకపోతే జైలుకు పోతావని పోలీసులు చేసిన హెచ్చరికతో భయపడిపోయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకున్నది.
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఖమ్మం జిల్లా లోని ముదిగొండకు చెందిన 25 ఏళ్ల గోపి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య కొత్తగూడెంలో నర్సింగ్ చేస్తుండటంతో ఇతడు కూడా అక్కడికే మకాం మార్చాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పని ముగించుకుని వస్తూవస్తూ మద్యం సేవించాడు. మద్యం సేవించి ద్విచక్రవాహనం నడుపుతుండటంతో పోలీసులకు పట్టుబడ్డాడు.
అనంతరం జూన్ 19న అతడికి పోలీసులు ఫోన్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కోర్టుకి హాజరై జరిమానా కట్టాలనీ, లేదంటే జైలుకు వెళ్తావంటూ హెచ్చరించారు. దీనితో భయాందోళనలకు గురైన గోపి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై గోపీ భార్య ... తన భర్త మరణానికి పోలీసులు అతడిని భయపెట్టడమే కారణమంటూ బోరుమంటూ విలపించింది.