ఎవరి కాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎల్పీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని, కానీ, నియోజకవర్గ ప్రజలు కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్టు ఆయన వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇస్తే అది మునుగోడు నియోజకవర్గాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవి కావాలా లేదా మునుగోడు ప్రజలు కావాలా అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని తెలిపారు. తాను పార్టీలో మళ్లీ చేరినపుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పారని, పదవులు అడ్డుపెట్టుకుని సంపాదించేవాడిని కాదన్నారు. తన స్వార్థం కోసం మంత్రి పదవిని అడగటం లేదన్నారు. మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.
భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. పదవి ఇస్తారా? ఇవ్వరా? అనేది పార్టీ అధిష్టానం ఇష్టమన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు, నా జూనియర్లకు కూడా ఇచ్చారన్నారు. ఎవరి కాళ్లో మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదన్నారు. దిగజారి బతకడం తనకు తెలియదన్నారు. మళ్ళీ త్యాగానికైనా సిద్ధం. ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్తాం. తన నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడూ చేయను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.