ఒకే ఇంట్లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ వంటి ఇద్దరు క్రికెటర్లు ఉండగా, ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి అని భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పైగా, కాంగ్రెస్ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి వంటివారు దృతరాష్ట్ర పాత్రను పోషిస్తున్నారని ఆయన ఆరోపించారు. భువనగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రిపదవి రాకపోవడంపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తనలాంటి వ్యక్తి మంత్రి పదవి ఇవ్వాలని పదేపదే అడుగుతుంటే చాలా బాధగా ఉందన్నారు. మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఎంపీ సీటును గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. పైగా, తనకు మంత్రిపదవి ఇస్తే దాన్ని ఒక కిరీటంలా కాకుండా, ఒక బాధ్యతగా నడుచుకుంటానని తెలిపారు.
పైగా, ఒకాయన అంటాడు... ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రిపదవులు ఎలా ఇస్తారని, దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్లలో యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్లు అన్నదమ్ములుగా కాగా, వారు దేశానికి ప్రాతినిధ్యం వహించడం లేదా అని ప్రశ్నించారు. అలాగే, ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు.
30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించి సీనియర్ నేత జానారెడ్డి ఇపుడు రంగారెడ్డి, హైదరాబాద్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారని, ఆయనకు ఇపుడు గుర్తుకు వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. తనకు మంత్రిపదవి రాకుండా జానారెడ్డి దృతరాష్ట్ర పాత్రను పోషిస్తున్నాడని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకుని ఉంటాడేగానీ అడుక్కునే స్థితిలో ఉండడని అన్నారు.