బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం, ఆదివారం ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఇక, రేపు సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది. ఈ జిల్లాలకు కూడా ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.