Publish Date: Sat, 07 Mar 2026 (17:31 IST)
Updated Date: Sat, 07 Mar 2026 (18:13 IST)
అల్లం వెల్లుల్లి పేస్ట్ గౌడౌన్లో కల్తీ బండారం బయటపడింది. అపరిశుభ్రమైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ను తయారు చేస్తున్నారనే ఆరోపణలపై సికింద్రాబాద్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, లాలాగూడ పోలీసులతో కలిసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. శనివారం లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్స్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితులను లాలాపేటలోని జనప్రియ అపార్ట్మెంట్స్ సమీపంలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ గోడౌన్ యజమాని నీలా వెంకటేశ్వరలు (56), సూపర్వైజర్ కె. వినోద్ (46), కార్మికులు టి. సతీష్ (23), ఎం. శివాని (46)గా గుర్తించారు. లాల్లగూడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 84/2026లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 318(4), 275, 223, 3(5) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో, పోలీసులు 1,915 కిలోల అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఎసిటిక్ యాసిడ్, శాంతన్ గమ్, ముడి అల్లం, వెల్లుల్లి, ప్లాస్టిక్ టబ్లు, ప్యాకింగ్ మెటీరియల్స్, డేట్ స్టాంపులు, లేబుల్స్, గ్రైండింగ్, తూకం, ప్యాకేజింగ్ కోసం ఉపయోగించే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు అల్లం, వెల్లుల్లి పేస్ట్ తో ఎసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి, ఆ మిశ్రమాన్ని ప్లాస్టిక్ టబ్ లలో చాలా రోజులు నిల్వ ఉంచారు. ఆ తర్వాత ఈ పేస్ట్ను వివిధ పరిమాణాల కంటైనర్లలో ప్యాక్ చేసి, నకిలీ బ్రాండ్ పేర్లతో లేబుల్ చేసి, స్థానిక కిరాణా దుకాణాలకు సరఫరా చేసి అక్రమ లాభాలు ఆర్జించారని పోలీసులు తెలిపారు.