హైదరాబాద్ నగరంలో కొందరు యువతులు మద్యంమత్తులో హల్చల్ సృష్టించారు. పీకల వరకు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేశారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన బైకును ఢీకొట్టారు. ఆ తర్వాత ఆ వాహనదారుడునే బెదిరించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. దీంతో బాధితుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. హల్చల్ చేసిన యువతులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైంది. దీంతో ఆ యువతులపై పోలీసులు కేసు నమోదు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఇటీవలి కాలంలో ధనవంతుల పిల్లలు, ఐటీ కంపెనీల్లో పని చేసే టెక్కీలు రాత్రి పూట పార్టీల పేరుతో పబ్బులకు వెళ్లి పీకల వరకు మద్యం సేవించి ఆ తర్వాత రోడ్లపై వాహనాలను ఇష్టానుసారంగా, అతివేగంతో నడుపుతూ ఇతర వాహనాదారులను, వాహనాలను ఢీకొడుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఇలాంటి సంఘటనపై జరిగింది. బైకర్ను ఢీకొట్టడమే కాకుండా మద్యమంత్తులో తిరిగి అతన్నే బెదిరించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.