తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతని ఫ్యాంటు జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒకటి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో ఆ యువకుడికి గాయాలయ్యాయి.
రాజేంద్ర నగర్ పరిధిలోని అత్తాపూర్కు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు పెయింటర్గా పని చేస్తున్నాడు. రోజులాగే తన స్మార్ట్ఫోన్ను ఫ్యాంటు జేబులో పెట్టుకుని పనికి వెళుతుండగా, ఫోన్ ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కింది. క్షణాల్లోనే దాని నుంచి మంటలు వ్యాపించి దుస్తులకు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన శ్రీనివాస్ ఫోనును జేబులో నుంచి బయటకు తీసినప్పటికీ అప్పటికే అతని తొడకు మంటలు తగిలి చర్మం కాలిపోయింది.
దీన్ని గమనించిన స్థానికులు హుటాహుటిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తొడపై చర్మం కాలిపోయిందని, శ్రీనివాస్ వెంటనే స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని వైద్యులు అంటున్నారు. కాస్త ఆలస్యమైతే గాయం కండరాల వరకు వెళ్లి ఉండేదని వారు వివరించారు.
కాగా, ఇటీవలికాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. మే నెలలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఓ బీటెక్ విద్యార్థి జేబులో ఫోన్ పేలి తీవ్రంగా గాయపడగా, యూపీలోనూ ఓ యువకుడి ఐఫోన్ పేలిపోయింది. ఫోన్ను అతిగా చార్జింగ్ చేయడం, బ్యాటరీ దెబ్బతినడం వంటి కారణాల వల్లే పేలుళ్లు సంభవిస్తాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.