Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు సతీమణి శైలజ

sridharbabu
, గురువారం, 14 డిశెంబరు 2023 (23:05 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మంది ఐపీఎస్, ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అలాగే, గురువారం కూడా మరికొందరు అధికారులను బదిలీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా, ఐఏఎస్ అధికారిణి అమ్రాపాలీని అందరూ అనుకున్నట్టుగానే అందలం ఎక్కించారు. ఆమెను కీలక బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ట్రాన్స్‌‍కో ఎండీగా సందీప్ కుమార్ ఝా, సౌత్ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, నార్త్ స డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా బి.గోపికి బాధ్యతలు అప్పగించారు. 
 
ప్రజా భవన్‌లోకి అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
 
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లోకి అడుగుపెట్టారు. ఆయన గురువారం ఉదయం కుటుంబ సమేతంగా ఈ భవనంలోకి విచ్చేశారు. గత ప్రభుత్వంలో ప్రగతి భవన్‌గా ఉన్న ఈ భవనం పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా కేటాయించారు. 
 
దీంతో ఆయన గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి భవనంలోకి అడుగుపెట్టారు. ముందుగా అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్ళారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
కామారెడ్డిలోని షాపింగ్ మాల్‌‍లో అగ్నిప్రమాదం.. రూ.కోట్లలో ఆస్తి నష్టం  
 
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తి నష్టం వాటిల్లింది. కామారెడ్డి పట్టణంలో ఉండే అయ్యప్ప షాపింగ్ మాల్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఇందులోని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళనకు గురై ప్రాణభీతితో పరుగులు తీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. జేసీబీ సాయంతో మాల్ షట్టర్లు తొలగించారు. 
 
మంటలను ఆర్పే పనులు అర్థరాత్రి నుంచి చేపట్టగా గురువారం ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. మిగతా రెండు అంతస్తుల్లోని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో సహాయక చర్యలు ఆటంకంగా మారింది. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తి కాలిబూడిదైందని షాపింగ్ మాల్ నిర్వహాకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీలక పోస్టుకి ఐఏఎస్ ఆమ్రపాలిని ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం