Publish Date: Tue, 11 Dec 2018 (13:36 IST)
Updated Date: Tue, 11 Dec 2018 (13:41 IST)
''బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని '' నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎంపి కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి ఓడిపోతే బ్లేడుతో గొంతు కోసుకుంటామని చెప్పిన వారిని, గెలిస్తేనే గడ్డం తీస్తానని చెప్పిన వారిని క్షమించి వదిలివేస్తున్నామని వ్యాఖ్యానించారు.
వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, ఇక వారి ప్రగల్భాలపై విజ్ఞతను వారికే వదిలివేస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత భయంకరమైన శిక్షే చాలా పెద్దదని, ప్రజలు విధించిన ఈ శిక్ష కన్నా మరో పెద్ద శిక్ష ఉండబోదని ఎద్దేవా చేశారు.
ఇక గడ్డాలు పెంచుకోవడం, సన్యాసం తీసుకోవడం వారిష్టమేనని, ఇకనైనా వారి మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తే, తదుపరి ఎన్నికల్లోనైనా మెరుగైన ఫలితాలను సాధించుకోవచ్చని కవిత సలహా ఇచ్చారు.