Publish Date: Sat, 24 Nov 2018 (16:37 IST)
Updated Date: Sat, 24 Nov 2018 (16:41 IST)
ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత వైఎస్ అయినా తెరాస అధినేత కేసీఆర్ అయినా తమకు గొడుగు పట్టాల్సిందేనంటూ వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికల్లో అయినా తాము చెప్పిందే జరగాలనీ, తాము తలచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతామంటూ ప్రకటించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ అయినా, కేసీఆర్ అయినా తమకు గొడుగుపట్టాల్సిందేన్నారు. మజ్లిస్ ముందు ఎవరైనా తలవంచాల్సిందేనన్నారు. డిసెంబర్ 11 తర్వాత తమ సత్తా ఏమిటో చూపుతామని చెప్పారు.
మరోవైపు అక్బర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదని రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం అనధికారికంగా కూటమిగా ఏర్పడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. ఎంఐఎం పోటీ చేస్తున్న ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టింది. అయితే ఈ సీట్లను ఆ పార్టీ గంపగుత్తగా గెలుచుకునేందుకు టీఆర్ఎస్ సహకరిస్తోందని విపక్ష నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు.