చిన్న లడ్డూ ధర రూ.50.. పెద్ద లడ్డూ ధర రూ.200
శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ధరలను రెట్టింపు చేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రసాదాల ధరను పెంచింది.
Publish Date: Thu, 21 Dec 2017 (09:40 IST)
Updated Date: Thu, 21 Dec 2017 (09:43 IST)
శ్రీవారి భక్తులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం పేరుతో భారం మోపింది. శ్రీవారి ప్రసాదాల ధరలను రెట్టింపు చేసింది. సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రసాదాల ధరను పెంచింది. ఫలితంగా ఇప్పటివరకు రూ.25కు విక్రయిస్తున్న చిన్న లడ్డూ ధరను రూ.50కు పెంచింది. అలాగే, పెద్ద లడ్డూ ధరను రూ.100 నుంచి రూ.200కు పెంచింది. అలాగే, వడ ధరను రూ.25 నుంచి రూ.100కు పెంచింది. పెరిగిన నూతన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు, కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో గురువారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. అలాగే స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.
నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2 గంటల సమయం పడుతోంది. కాగా... తిరుమల శ్రీవారిని బుధవారం 62, 351 మంది భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.