Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల వేంకటేశ్వరుడి భక్తులకు అతి ముఖ్యమైన సమాచారం

తిరుమల వేంకటేశ్వరుడి భక్తులకు అతి ముఖ్యమైన సమాచారం
, మంగళవారం, 1 మార్చి 2022 (14:42 IST)
తిరుమల ఘాట్ రోడ్డుల్లో భక్తుల అనుమతి సమయాలు మార్పు చేసింది టిటిడి.. భక్తుల సంఖ్య పెరిగే క్రమంలో భక్తులు ఇకపై ఈ షరతు తప్పక పాటించాల్సిందే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంలో క్షణకాలం పాటు జరిగే శ్రీనివాసుడి దర్శన భాగ్యం కోసం భక్తులు పరితపించి పోతుంటారు. ప్రతినిత్యం దేశ విదేశాల నుండి వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. కలియుగ నాధుడి దర్శన కోసం ఎన్నో వ్యయప్రయాసలకు లోనై వివిధ రూపాల్లో తిరుమలకు చేరుకుంటారు.

 
గంటల తరబడి క్యూలైన్స్‌లో వేచి ఉండి మరీ స్వామి వారిని దర్శించుకుంటారు. స్వామి వారిని దర్శించుకుంటే చాలు తాము చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇదంతా కోవిడ్ వ్యాప్తి కాక ముందు వరకూ జరిగే దర్శన విధివిధానాలు. అయితే కొవిడ్ వ్యాప్తి తరువాత ఇందుకు భిన్నంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ వస్తుంది టిటిడి.

 
ఇదేవిధంగా అలిపిరి తనిఖీ కేంద్రంలో టిక్కెట్లు ఉన్న భక్తులను‌ మాత్రమే కొండకు అనుమతిస్తూ వస్తొంది టిటిడి. కోవిడ్ నిబంధనల మేరకు తక్కువమందినే తిరుమలకు అనుమతిస్తున్న నేపధ్యంలో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతి సమయంను కూడా కుదించింది టిటిడి. కోవిడ్ వ్యాప్తి పూర్తి స్ధాయిలో తగ్గుముఖం పట్టడంతో గత పాలక మండలి సమావేశంలో భక్తుల సంఖ్య పెంపుకు ఆమోదం తెలిపింది. దీంతో దర్శన టోకెన్ల సంఖ్యను పెంచింది టిటిడి.

 
ఈ క్రమంలోనే ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతి సమయంను కూడా టిటిడి మార్పు చేసింది. అంతేకాకుండా భక్తుల రద్దీ పెరుగుతున్న సమయంలో భక్తులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు, టిటిడి పెట్టిన షరతులను పాటించాలని కోరుతుంది. శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు ఉంటేనే అలిపిరి తనిఖీ కేంద్రం, నడకదారి వద్ద టిటిడి విజిలెన్స్ సిబ్బంది కొండకు అనుమతించనుంది. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలు మేరకు ప్రతి భక్తుడు మాస్క్ ధరించి ఉంటేనే కొండకు అనుమతించనున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్ళరాదని సూచించింది.

 
తిరుమలలో నిషేధిత వస్తువులైన మాంసం, మద్యం, బీడీలు, సిగరెట్లు తదితర పొగాకు సంబంధిత వస్తువులు పూర్తిగా నిషేధించిన కారణంగా కనుక భక్తులు ఎవరూ తమ వెంట సదరు వస్తువులను తీసుకొని రాకూడని హెచ్చరించింది. శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కువ శాతం సొంత వాహనాల్లో, బాడుగ వాహనాల్లో వస్తుంటారు. దీంతో ఎల్లప్పుడూ తిరుమల ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకతో రద్దీగా ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిలో పూర్తిస్థాయిలో మార్పు చేసింది. 

 
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుండి ఉదయం 3 గంటలు నుండి రాత్రి 12 గంటల వరకు, ద్విచక్ర వాహనాలను ఉదయం 4 గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు అనుమతించడమే కాకుండా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పని సరిగా ధరించి రావాలని టిటిడి తెలిపింది. ఘాట్ రోడ్డులో ప్రయాణ సమయంలో అతివేగం ప్రమాదకరం కావడంతో భక్తులు అందరూ నిదానంగానే ప్రయాణించాలని సూచించింది టిటిడి.

 
సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర, శని, ఆది వారాల్లో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. విఐపిల కోసం కేటాయించిన సమయాన్నీ కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టిటిడి. ఇక శుక్ర, శని, ఆదివారాలలో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం అదనంగా దర్శన టోకన్లు జారి చేసేందుకు టిటిడి నిర్ణయించింది. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టోకన్లు టిటిడి జారీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సర్వదర్శన భక్తుల సౌకర్యార్ధం రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం రాత్రి శ్రీకాళహస్తిలో లింగోద్భవ దర్శన భాగ్యం