Publish Date: Sat, 12 Sep 2020 (15:56 IST)
Updated Date: Sat, 12 Sep 2020 (15:57 IST)
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం ఉదయం జరిగిన సుందరకాండలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను దాదాపు 200 మంది వేద పండితులు అఖండ పారాయణం, శ్రీరామ నామ స్మరణతో తిరుమలగిరులు పులకించాయి.
ఈ సందర్భంగా రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళిధర్ శర్మ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రచించిన రామయణంలోని సుందరకాండ పారాయణాన్నిటిటిడి అద్భుతంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో కోట్లాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించి పాల్గొంటున్నట్లు తెలిపారు. శ్రీవారి అనుగ్రహం వలన త్వరలో కరోనా వైరస్ నశించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.
సుందరకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్న తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ ప్రజల యోగ క్షేమం కొరకు టిటిడి 156 రోజులుగా శ్రీవారి అనుగ్రహంతో మంత్ర పారాయణ కార్యక్రమం నిర్వహస్తున్నట్లు తెలిపారు. సుందరకాండ పారాయణంలో 94వ రోజైన శనివారం 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను 4వ విడత అఖండ పారాయణం నిర్వహించామన్నారు.
అఖండ పారాయణంలో భాగంగా జూలై 7 నమొదటి పర్యాయం ప్రథమసర్గలోని 211 శ్లోకాలను, ఆగష్టు 6 న 2వ పర్యాయం ద్వితీయ సర్గ నుంచి సప్తమ సర్గ వరకు ఉన్న మొత్తం 227 శ్లోకాలను, ఆగస్టు 27 న 3వ పర్యాయం అష్టమ సర్గ నుంచి ఏకాదశః సర్గ వరకు ఉన్న మొత్తం 182 శ్లోకాలను పారాయణం చేసినట్లు తెలిపారు.
టిటిడి ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీమతి వందన బృందం ప్రసిద్ధ త్యాగరాజ పంచరత్న కృతులు "జగదానందకారక.... జయ జానకి ప్రాణ నాయక......" అనే సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ బి.రఘునాథ్ బృందం అందించిన హనుమాన్ భజన్తో కార్యక్రమం ముగిసింది.
అఖండ పారాయణంలోని 12వ సర్గ నుంచి 14వ సర్గ వరకు ఉన్న 146 శ్లోకాలను శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధానితో కలిసి శ్రీ పవన్కుమార్ శర్మ, శ్రీ శేషాచార్యులు పారాయణం చేశారు. ఈ పారాయణంలో ధర్మగిరి వేద పాఠశాల, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఎస్వీ ఉన్నత వేద అధ్యాయన సంస్థకు చెందిన వేద పారాయణ దారులు, రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రీయ పండితులు పాల్గొన్నారు.