Publish Date: Thu, 22 Jul 2021 (11:02 IST)
Updated Date: Thu, 22 Jul 2021 (11:06 IST)
అమ్మలగన్న అమ్మ... ముగ్గురమ్మల మూలపుటమ్మ... బెజవాడ కనక దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం.... ఇంద్రకీలాద్రిలో శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారభమయ్యాయి.
నేటి నుంచి 24 వరకు జరిగే ఈ ఉత్సవాలను రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి.వాణి మోహన్, ఇ.వో డి.భ్రమరాంబ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, కరువు కాటకాలు దరిచేరరాదని... అమ్మవారికి కూరగాయలతో, ఆకు కూరలతో అలంకరణ చేయడమే, శాకాంబరీ ఉత్సవాల ప్రత్యేకత.
ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్కు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ కార్య నిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. అమ్మవారి శాకంబరీ దేవి ఉత్సవాల సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో ఆకు కూరలు, కూరగాయలుతో చేసిన అలంకరణలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
భక్తుల సౌకర్యార్థం దేవస్తానంలో చేసిన ఏర్పాట్లను వాణీమోహన్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. దేవస్థానంలో జరుగుతున్న ఇంజినీరింగ్ పనులను గురించి కార్యనిర్వహణాధికారి, ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ వివరించగా, ప్రిన్సిపల్ సెక్రటరీ పలు సూచనలు చేశారు.