Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం

Advertiesment
Old Notes
Old Notes
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే శ్రీవారి హుండీలో ఏళ్ల క్రితం రద్దైన నోట్లు వచ్చిపడుతున్నాయి. ఇది టీటీడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నోట్లు 2016లో రద్దు అయినప్పటికీ తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం ఆగట్లేదు. తాజా సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు నిల్వ వున్నాయి. 
 
భక్తులు తమ వద్ద ఉండిపోయిన లేదా మరిచిపోయిన ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ ఇప్పటి వరకు అనుమతి నిరాకరించాయి. దీనివల్ల టీటీడీకి వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. 
 
మరోవైపు ఇటీవలే చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తోంది. రూ.2వేల నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండటంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేస్తోంది. 
 
కానీ రూ.500, రూ.1000ల నోట్లు కేవలం కాగితపు రాశిగా మిగిలిపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను గౌరవించి, టీటీడీ వద్ద వున్న ఈ భారీ మొత్తాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి మార్పిడి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైశాఖ కృష్ణ పక్ష పంచమి: ఉజ్జయిన్‌ మహాకాలేశ్వర ఆలయంలో భస్మ హారతి