శ్రీవారి పరువు రూ.100 కోట్లేనా అంటున్న మాజీ ప్రధాన పూజారి
తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అవకతవకలపై తాను ప్రశ్నిస్తే తనపై పరువు నష్టం దావా వేస్తారా అంటూ తితిదే మాజీ ప్రధాన పూజారి రమణ దీక్షితులు ప్రశ్నించారు. పైగా, శ్రీవారి పరువు రూ.100 కోట్లేనా అని ఆయన నిలదీ
Publish Date: Wed, 20 Jun 2018 (16:23 IST)
Updated Date: Wed, 20 Jun 2018 (16:24 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిన అవకతవకలపై తాను ప్రశ్నిస్తే తనపై పరువు నష్టం దావా వేస్తారా అంటూ తితిదే మాజీ ప్రధాన పూజారి రమణ దీక్షితులు ప్రశ్నించారు. పైగా, శ్రీవారి పరువు రూ.100 కోట్లేనా అని ఆయన నిలదీశారు.
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారికి అన్ని పూజలు సరిగ్గా జరుగుతున్నాయని, శ్రీవారి నగలు భద్రంగా ఉన్నాయని నిరూపించుకోవాలని కోరారు. తనపై పరువునష్టం దావా వేయాలని టీటీడీకి ఎవరు సలహా ఇచ్చారో తెలియదన్నారు. ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తారా? అని నిలదీశారు. ఇది ప్రజాస్వామ్యమా... నిరంకుశత్వమా? అని ప్రశ్నించారు. టీటీడీకి పరువునష్టం దావా వేసే అధికారం ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను శ్రీ వెంకటేశ్వరస్వామివారి పరువును తీశానని ఆరోపిస్తూ రూ. 100 కోట్లు చెల్లించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తనకు నోటీసులు పంపించారని, కోట్ల మంది కొలిచి, తమ ఇష్టదైవంగా పూజించే కలియుగ దేవదేవుని పరువు విలువ రూ. 100 కోట్లని ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు. వెలకట్టలేని స్వామికి వెలకట్టిన ఘనత ఈ అధికారులకే దక్కిందని నిప్పులు చెరిగారు.
తాను చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతమైన విచారణ జరిపాల్సిందిపోయి, తనకు నోటీసులు ఏంటని ప్రశ్నించారు. స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్ర పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలూ జరుగుతున్నాయని భక్తులకు నమ్మకం కలిగించే చర్యలు ఎక్కడ తీసుకున్నారని అడిగారు. ఆరాధనలు, అభిషేకాలు, అలంకారాలు, నైవేద్యాలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించుకోవాలని డిమాండ్ చేసిన రమణ దీక్షితులు, స్వామివారి ఆస్తులను, దివ్యమైన తిరువాభరణాలు భద్రమని నిరూపించుకోవాలని కోరారు.