Publish Date: Fri, 23 Apr 2021 (19:59 IST)
Updated Date: Fri, 23 Apr 2021 (20:01 IST)
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం రాత్రి సింహ వాహనంపై స్వామివారు సీతా, లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో 'సింహదర్శనం' అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ మురళీధర్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ధనంజయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.