Publish Date: Tue, 27 Jul 2021 (22:33 IST)
Updated Date: Tue, 27 Jul 2021 (22:36 IST)
ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం పాపం. దీనిని పూర్తిగా విసర్జించాలి. మనస్సులో ఏమేమో తోచవచ్చు, కాని వాటిని బయట పెట్టటానికి ప్రయత్నిస్తే క్రమ క్రమంగా అవి గోరంతలు కొండతలుగా తయారవుతాయి. క్షమించి మరచిపోతే అంతా సమసిపోతాయి.
ఇతరులు ఏమి తలచినా, ఏమి చేసినా సరే నీవు మాత్రం నీ పావనత్వాన్ని, నైతిక వర్తనను, భగవద్భక్తి యెుక్క స్ధాయిని దిగజార్చకు. పవిత్రత, సహనం, పట్టుదల-విజయాన్ని సాధించడానికి కావలసిన మూడు ఆవశ్యకాలు. వీటన్నింటికి మించి కావలసింది-ప్రేమ.
నీవు పవిత్రుడవు, బలసంపన్నుడవు అయితే నీవు ఒక్కడవు అఖిల జగత్తుకు సమానుడవు అవుతావు. విద్యార్థి దశలో బ్రహ్మచర్యం నరాల్లో అగ్నిలా ప్రజ్వలించాలి.
పవిత్రులు కండి.. శక్తి వస్తుంది. పవిత్ర మనస్సులో అనంత శక్తి, గొప్ప సంకల్పబలం ఉంటాయి. బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది.
పవిత్రత, నిశబ్దతల నుండే అమోఘ వాక్కు వెలువడుతుంది. పవిత్రతే గొప్ప శక్తి. దాని ముందు మిగిలినదంతా బిత్తరపోతుంది. నాయకుడిలో సౌశీల్యం లోపిస్తే విధేయతను పొందలేడు. సంపూర్ణ పవిత్రత కలకాలం నిలిచే విధేయతను, నమ్మికను పెంపొందిస్తుంది. అలాంటి వినయవిధేయతలు కలవారే గొప్పవారుగా పేరుప్రఖ్యాతులు గడిస్తారు.