Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ దేవాలయంలో నిద్రిస్తే కలలో అలా కనిపిస్తే సంతానం ఖాయం...

తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది. మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్ధం భక్

ఆ దేవాలయంలో నిద్రిస్తే కలలో అలా కనిపిస్తే సంతానం ఖాయం...
, శుక్రవారం, 18 మే 2018 (21:23 IST)
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న మరో పుణ్యక్షేత్రం అంతర్వేది. మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యతీర్ధం భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం. అతి ప్రాచీన ఆలయం ఇది. ఇక్కడ నరసింహస్వామి లక్ష్మీసమేతుడై కొలువుతీరాడు.
 
గోదావరి నదికి ఇటువైపు ఉన్న సఖినేటి పల్లి.. మండలానికి చెందిన అంతర్వేది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. అటు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో ఉంది. ఇది దక్షిణ కాశీగా పేరుపొందింది. త్రేతాయుగంలో రాముడు అరణ్యవాస సమయంలో ఈ పల్లె మీదుగా పయనిస్తూ సీతతో సఖీ ఇదే నేటి పల్లి. మనం ఇక్కడే విశ్రమిద్దాం అన్నాడు. 
 
అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలు తమ ఊరిని సఖీనేటి పల్లెగా పిల్చుకునే వారని అంటారు. ఈ స్వామి ఇక్కడ వెలవటానికి కారణం హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ విశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుంచి ఒక వరం కోరతాడు. తన శరీరం నుండి పడిన రక్తపు బిందువులు ఇసుకరేణువుల మీద పడితే ఆ ఇసుక రేణువుల నుంచి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని వరం పొందుతాడు. 
 
ఆ వర గర్వంతో బ్రాహ్మణులను, గోవులను హింసిస్తూ ఉండేవాడు. విశ్వామిత్రుడికి, వశిష్టుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు బీభత్సం సృష్టించి వశిష్టుడి నూర్గురు పుత్రులను సంహరిస్తాడు. వశిష్టుడు మహా విష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై రక్తావలోచనుడుని సంహరించటానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాదిమంది రాక్షసులు జన్మిస్తారు. 
 
నరసింహుడు ఈ విషయం గ్రహించి తన మాయా శక్తి ఉపయోగించి అతని శరీరం నుండి పడిన రక్తాన్ని అంతా నేలపై పడకుండా అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సంహరిస్తాడు. ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్టుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిగా వెలిశాడు. ఈ నదిలో స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని చెబుతారు. సముద్ర తీరాన ఆలయానికి దగ్గరలో వశిష్ట ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమం కమలం ఆకారంలో నాలుగు అంతస్తులుగా నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్య కమలం ఆకారంలో ఉంది ఈ కట్టడం. 
 
దగ్గరలో ధ్యానమందిరం, యోగశాల, పర్ణశాల ఉన్నాయి. పర్ణశాలలో యాత్రికులు విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే సముద్రంలో వశిష్ట గోదావరి నది కలిసే చోటును మధ్య భాగంలో ఒక గట్టు ఉంటుంది. ఈ గట్టుకు అన్నాచెల్లెల గట్టు అని పేరు. ఆ గట్టుకు అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా మరొక వైపు మట్టిగా కనిపిస్తుంది. 
 
లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలో అశ్వరూడాంబికాలయం ఉంది. శ్రీరాముడు సీతాసమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్ట ఆశ్రమాన్ని, లక్ష్మీనరసింహమూర్తిని దర్శించి సేవించినట్లు అక్కడే కొన్ని రోజులు నివసించినట్లు అక్కడి శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. ద్వాపర యుగంలో అర్జునుడు కూడా అంతర్వేదిని దర్శించినట్లు తెలుస్తుంది. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయంలో సంతానం లేనివారు స్వామి వారిని దర్శిస్తే తమ కోరిక తీరుతుందని నమ్మకం. ఈ గుడిలో రాత్రి తడి బట్టలతో నిద్రిస్తారు. 
 
నిద్రలో పళ్లు, చిన్నపిల్లల బొమ్మలు కలలో కనిపిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతర్వేది చేరుకోవటానికి రాజమండ్రి నుండి రాజోల్ మీదుగా సఖినేటిపల్లి చేరుకోవచ్చు. అక్కడి నుండి ఆటోలు, బస్సుల ద్వారా అంతర్వేది చేరుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీనివాసునికే నైవేద్యాలు తగ్గించేస్తున్నారా.. ఎందుకు?