Publish Date: Mon, 10 Mar 2025 (22:04 IST)
Updated Date: Mon, 10 Mar 2025 (22:06 IST)
ప్రదోషమంటే పాపాలను నశింపజేస్తుంది. త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషం అంటారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం.
సంధ్యాసమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకం, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి శివునికి సమర్పించాలి. చివరగా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
శివలింగానికి పాలు, పెరుగు మొదలుగు ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. తరువాత బిల్వదళాలతో పూజ చేస్తారు. ప్రదోష కాలం లో బిల్వదళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి అని భక్తులు నమ్ముతారు.
నానబెట్టిన శనగలను భక్తితో శివునికి, గురువులకు నివేదించి వాటిని ఆలయంలో భక్తులకు పంచి పెట్టాలి. దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేయాలి. ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు.
ప్రదోషం వ్రతం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. అపవాదులు దూరమవుతాయి. వ్యాపార వ్యవహారాలలో నష్ట నివారణ జరుగుతుంది. సంతాన సాఫల్యం కలుగుతుంది. చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది.