Publish Date: Fri, 06 Sep 2019 (22:23 IST)
Updated Date: Fri, 06 Sep 2019 (22:26 IST)
నిత్య జీవితంలో మానవుడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు. ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎక్కడో అబద్ధాలు చెపుతూ ఆనందపడేవారు కొందరైతే ఈర్ష్య తదితర గుణాలతో సతమతమయ్యేవారు మరికొందరు. మహాభారతంలో విదురుడు కొన్ని నీతి సూత్రాలు చెప్పాడు. అవేంటో చూద్దాం. బుద్ధి ఒక్కటే. దాంతో చెయ్యతగ్గదీ, చెయ్యరానిదీ ఏమిటనేవి రెండూ నిశ్చయించుకోవాలి. సామమూ, దానమూ, భేదమూ, దండమూ ఈ నాలుగు ఉపాయాలతో మిత్రుడినీ, తటస్థంగా వున్నవాడినీ, గర్భశత్రువునీ... ఈ ముగ్గురినీ వశపరచుకోవాలి.
ఇంద్రియాలయిదూ నిగ్రహించుకుని సంధీ, విగ్రహమూ, యానమూ, ఆసననమూ, ద్వైధీభావమూ, సమాశ్రయమూ... ఈ ఆరు గుణాలు బాగా అలవరుచుకుని స్త్రీల యెడల వ్యామోహమూ, జూదమూ, వేటా, సురాపానము, పుల్లవిరిచినట్లు మాట్లాడటమూ, క్రూరంగా దండించడమూ, దుబారా ఖర్చులు చేసి డబ్బు నాశనం చేసుకోవడమనే ఈ ఏడూ వదులుకుంటే సుఖం కలుగుతుంది.
పుచ్చుకున్న వాడిని ఒక్కడినే చంపుతుంది విషం. కత్తి దెబ్బ కూడా ఒక్కడినే కడతేరుస్తుంది. ఉన్న మంచి పదార్థాలన్నీ ఒక్కడే ఆరగించకూడదు. ఒక్కడే కూర్చుని ఏ ఆలోచనా చేయకూడదు. దూరదేశాలు వెళ్లవలసి వస్తే ఒక్కడే వెళ్లకూడదు. ఇంటిల్లపాదీ గాఢంగా నిద్రపోయేటప్పుడు ఒక్కడే మేలుకుని వుండకూడదు. సత్యం ఒక్కటే తెలుసుకోదగ్గది. పలకవలసిందీ సత్యం ఒక్కటే. ఆ సత్యం స్వర్గానికి మెట్టు. సముద్రంలో ప్రయాణం చేసే వాడికి ఓడ యెటువంటిదో లోకంలో బతికేవాడికి సత్యం అటువంటిది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా సత్యం మాత్రం వీడకూడదు.