Publish Date: Thu, 24 Mar 2022 (23:55 IST)
Updated Date: Thu, 24 Mar 2022 (23:57 IST)
దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుని చేత స్వయంగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత ఉపదేశములను యధార్థముగా అనుసరించువాడు దివ్యజ్ఞానపు కృపచే సమస్త సందేహాల నుండి విముక్తుడవుతాడు.
సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవదంశగా గుర్తించిన వ్యక్తి అదివరకే ఆత్మజ్ఞానములో స్థితుడైనట్లు అర్థము. కనుకనే నిస్సందేహముగా అతడు కర్మబంధాలకు అతీతుడవుతాడు.
మానవులు ఇంద్రియభోగాల పట్ల అత్యంత ఆసక్తులై వుంటారు. దుఃఖపూరితమైన ఈ ప్రస్తుత దేహం పూర్వజన్మ కర్మఫలంగా వచ్చినదని తెలుసుకోలేరు. ఈ దేహం తాత్కాలికమైనప్పటికీ జీవులకు ఎల్లప్పుడూ అనేక రకాలైన బాధలను కలిగిస్తుంది. అందువల్లనే ఇంద్రియ భోగము కోసం తన నిజస్థితిని తెలుసుకోనంత కాలం అతడు పరాజయం చెందినట్లు విశ్వసిస్తుంటాడు.
అలా ఇంద్రియ భోగ భావనలో నిమగ్నుడై వుండునంత కాలం అతడికి ఒక దేహం నుంచి మరో దేహానికి పరిణామం చెందాల్సి వస్తుంది. అలా మనసు కామ్యకర్మలతో వుంటే, అజ్ఞానంతో ప్రభావితమైనప్పటికీ ఏదో ఒక విధంగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్తిసేవల పట్ల ఆసక్తి పెంపొందికోవాలి. అప్పుడే ఎవరైనను భౌతిక భవబంధముల నుంచి విముక్తి సాధించు అవకాశం పొందగలరు.