Publish Date: Tue, 22 Mar 2022 (23:07 IST)
Updated Date: Tue, 22 Mar 2022 (23:09 IST)
మనిషి గత జన్మలో సత్కర్మలు చేసి దాచుకున్న ఫలితమే ఈ జన్మలో లభించగా అనుభవించడం జరుగుతున్నది. అలాగే తమకు కష్టాలు, నష్టాలు, అనారోగ్యాలు, ఇత్యాది ఇబ్బందులు సంప్రాప్తించినప్పుడు ఇవన్నీ భగవంతుడే చేశాడనో ఇతరుల వల్ల కలుగుతున్నాయనో అనుకోవడం అజ్ఞానం. సిరిసంపదలు పెట్టి పుట్టినట్లే, కష్టాలకు కూడా గత జన్మలో చేసిన కర్మల ఫలితంగా ఇప్పుడు అనుభవంలోకి వస్తాయి.
సిరి సంపదలు అంటే మానవులు తాము సంపాదించుకున్నవనో, తమవారు సంపాదించి ఇచ్చినవనో అహంకరిస్తూ ఉంటారు. కానీ కష్టాలొస్తే మాత్రం భగవంతుడి కల్పించాడని, తమకే ఎందుకు వస్తున్నాయనో వాపోవడం జరుగుతుందే తప్ప తమ ప్రారబ్దకర్మానుసారం జరుగుతున్నవనే అని అనుకోవడం జరుగదు. లోకంలో ఘనాఘనాలు పుట్టుకతోను, జీవితంలో ఉన్నట్లే మరణం కూడా సహజంగానే ఉంటుంది. ఒక్కో ప్రాణికి అనాయాసంగా మరణం సంభవిస్తూ ఉంటుంది. మరి అంతమంది పట్ల ఎంతగా ఆ వ్యక్తి కోరుకున్నా కూడా మరణం కరుణించడం జరుగదు.
ఇది కూడా ఆ వ్యక్తి తెచ్చుకున్న కర్మ ఫలమే. మనుష్యులు కర్మలు చేయనిదే ఒక్క క్షణం కూడా అతడి జీవితం ముందుకు కదలదు. తప్పనిసరిగా ఏదో ఒక పనిచేయవలసినదే. అది కూడా త్రికరణ శుద్ధిగా ఏదీ ఆశించకుండా కష్టపడడం, సంపాదించు, అనుభవించు, ఏదైనా ధర్మయుక్తంగా. మనుష్యులకు తమ పుట్టుక తెలియదు. మరణం ఎప్పుడన్నది తెలియదు. మధ్య జీవితం తమదనుకోవడం జరుగుతుంది. తమది ఎంతవరకు అంటే మంచి చెయ్యడం, ధర్మంగా ప్రవర్తించడం, తమ కర్తవ్యాన్ని చేస్తూ పోవాలే తప్ప క్రూర కర్మలకు చోటివ్వకూడదు.
ఫలితాన్ని ఆశించక ఫలాలన్నీ పరమాత్మకే అనే భావనతో కర్మలు చేస్తూ ఉండాలి. అయితే ఈ విధంగా ప్రవర్తించడం కొంచెం కష్టతరమనే చెప్పాలి. ఏ పనిచేసినా ఫలితం ఆశించకుండా సామర్థ్యంతో పనిమీద దృష్టి నిలిపి భగవంతుని కోసం, ఈ జీవితం భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించ గల భావన పెంపొందించుకుంటే జీవన యాత్ర స్వర్గారోహణ యాత్ర కాదా?