Publish Date: Fri, 29 Mar 2019 (21:56 IST)
Updated Date: Fri, 29 Mar 2019 (21:57 IST)
కుల, మత, ప్రాంతీయ, వయో భేదాలు లేకుండా ఎవరైన పూజ చేసుకోవచ్చు. ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ.... ఆ పూజ త్రికరణశుద్ధిగా చేయాలి. అంటే మనోవాక్కాయకర్మలను పూర్తిగా భగవంతుడి మీదే లగ్నం చేసి పూజ చేయాలి. మనసుని పూర్తిగా పరమాత్మ మీద లగ్నం చేసి వాక్కుని శుద్దిగా ఉంచుకుని, స్పష్టంగా ఉచ్చరిస్తూ, పరిపూర్ణమైన భక్తితో క్రియను చేస్తూ భగవంతుడిని పూజించాలి తప్ప చిత్తం ఒకచోట, క్రియ ఒకచోట ఉండకూడదు.
అలాగాక ప్రచారం కోసం రోజులు, నెలలు తరబడి ఎన్ని గంటలు పాటు ఏకధాటిగా పూజ చేసినా ప్రయోజనం ఉండదు. నిరంతరమూ భగవంతుడిని మనసులో నిలుపుకుని కర్మఫలాన్ని ఆయనకే సమర్పిస్తున్నామన్నా భావనతో పూజ చేయాలి. అద్వైత స్థితిని పొందిన వారికి ప్రాపంచకమైన రీతి రివాజులతో పని లేదు. అలాకాని స్థితిలో ఉన్నప్పుడు, ప్రాపంచిక వాసనలనుంచి దూరంగా వెళ్లలేని పరిస్థితులలో ఉన్నప్పుడు పూజాదికాలు మీ మనస్సును పరమాత్మతో అనుసంధానం చేయడానికి పనికి వస్తాయి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరి కీర్తి నుడవడేని అని అందుకే అన్నారు.