Publish Date: Thu, 28 Mar 2019 (15:54 IST)
Updated Date: Thu, 28 Mar 2019 (15:55 IST)
దేవుళ్లకు అరటి, కొబ్బరికాయలను మాత్రమే సమర్పించాలి. భగవంతునికి సమర్పించడానికి ఎన్ని ఫలాలున్నా అరటిపండు, కొబ్బరికాయలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటికి పూర్ణఫలాలు అని పేరుంది. దానికి కారణం సృష్టిలో ఉన్న ఏ ఇతర ఫలాన్నైనా మనం ఆరగించి వాటిలోని విత్తనాలను నోటిలో నుండి ఉమ్మేస్తాం.
దాని వలన విత్తనాలు ఎంగిలిపడతాయి. కొన్ని పండ్లను పక్షులు తిని విత్తనాలను విసర్జిస్తాయి. అవి మొలకెత్తి, తిరిగి పుష్పించి పండ్లను కాస్తాయి. ఆ పండ్లను మనం దేవునికి నైవేద్యంగా పెడతాం. ఇది అంత శ్రేష్టం కాదు. ఐతే అరటి లేదా కొబ్బరి చెట్ల విషయంలో అలా జరుగదు. అరటిచెట్టు విత్తనాల ద్వారా కాకుండా పిలకల ద్వారా మొలిచి పండ్లను ఇస్తుంది.
కొబ్బరి చెట్టు విత్తనం కలిగిన చెట్టే అయినప్పటికీ దానికి ఎంగిలి దోషం అంటదు. అందుకే అరటి పండు, కొబ్బరికాయలు పూర్ణఫలాలయ్యాయి. విఘ్నేశ్వరుడు, హనుమంతుడు, శ్రీరాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. అందువల్ల ఈ దేవుళ్లను కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరి.