Publish Date: Fri, 12 Apr 2019 (11:09 IST)
Updated Date: Fri, 12 Apr 2019 (12:52 IST)
తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మంది భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటాం. బిగ్గరగా మంత్రాలు పఠించడం, పూజలు, పునస్కారాలు చేయడం, జపాలు చేస్తుంటారు. ఇలా చేయడం వలన తాము అనుకున్నది సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇంకొంతమంది కోరిన కోర్కెలు నెరవేరడానికి భగవంతుడి మెప్పు పొందేందుకు ఉపవాసాలు ఉంటుంటారు. పలురకాల వ్రతాలూ చేస్తుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కొంతమంది భక్తులు గంటలకొద్దీ పూజలు, వేలకొద్దీ జపాలు, అనేక వ్రతాలు, ఉపవాసాలూ చేసినా ఏ ప్రయోజనాన్ని ఆశించి చేశారో, ఆ ప్రయోజనం నెరవేరకపోవడంతో నిరాశ పొందడం జరుగుతుంది.
భగవంతుడిని ఆరాధించే కొద్ది సేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునియందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా పేర్కొంటారు. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే.