ఆలుమగల సంబంధాలు బలపడాలంటే.. ఈ చిట్కాలు పాటించాలి అంటున్నారు సైకలాజిస్టులు. దంపతుల్లో ముఖ్యంగా రాజీపడే ధోరణి వుండాలి. ఒకరి కోసం ఇంకొరు మెట్టు దిగాలి. పట్టుదల, మొండితనం వుండకూడదు. భార్యాభర్తలు చాలామంది గొడవ పడుతున్నప్పుడు పెద్దగా అరుస్తుంటారు. అర్థం పర్థం లేని మాటలు అనేస్తారు. అలాకాకుండా ఉండాలంటే గొడవ సమయంలో దంపతుల్లో ఒకరు సైలెంట్గా ఉండాలని, దీని వల్ల ఎదుటివారికి కోపం కంట్రోల్ అవుతుందని సైకలాజిస్టులు సూచిస్తున్నారు.
ఏదైనా గొడవ జరిగినప్పుడు ఎదుటివారిని బాధ్యులుగా చేయడం మంచిది కాదు. ఒకరిలో వున్న ప్లస్లు, మైనస్లను గ్రహించి ప్రవర్తించడం మంచిది. ప్లస్లను అప్పుడప్పుడు ఎత్తిచూపాలి. నలుగురిలో భార్యాభర్తలు తమ భాగస్వామిని చులకన చేసి మాట్లాడకూడదు. సహనం చాలా ముఖ్యం.
దాంపత్య బంధమంటే ఎన్నో బరువు బాధ్యతలతో కూడుకున్నది. వివాహం కాక ముందు వరకు ఎలా ఉన్నా, పెళ్లయ్యాక మాత్రం దంపతులిద్దరూ ఒకరికొకరు కొన్ని విషయాల్లో సర్దుకపోవడం తప్పనిసరంటున్నారు నిపుణులు. ఈ తరం దంపతుల్లో భేదాభిప్రాయాలు రావడానికి డబ్బు కూడా ముఖ్య కారణమంటున్నారు నిపుణులు.
అందుకే దంపతులిద్దరూ ఎవరెంత సంపాదించినా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత పొదుపు చేసినా దాపరికం లేకుండా అన్ని విషయాలు పంచుకోవడం అత్యుత్తమం అని సూచిస్తున్నారు. కలుపుగోలు తనంతో దంపతులు ప్రవర్తిస్తే కాపురం సజావుగా సాగుతుందని సైకలాజిస్టులు అంటున్నారు.