ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) పురుగు కాటుతో వస్తున్న జ్వరంతో రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్టణంలో గత రెండు నెలల్లో 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం, కాకినాడ, విజయనగరం, చిత్తూరు, పల్నాడు తదితర జిల్లాల్లో ఈ జ్వరంతో బాధపడుతున్నవారి కేసులు వెలుగుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏమిటీ స్క్రబ్ టైఫస్ ఫీవర్, దాని లక్షణాలు ఏమిటో తెలుసుకుందాము.
స్క్రబ్ టైఫస్ లక్షణాలు
స్క్రబ్ టైఫస్ లక్షణాలు సాధారణంగా చిగ్గర్ మైట్ అనే పురుగు కరిచిన 6 నుండి 21 రోజులలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ లక్షణాలు ఇతర జ్వరాల మాదిరిగానే ఉంటాయి. అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం, అంటే 102-104°F లేదా అంతకంటే ఎక్కువ జ్వరంతో వణుకుడు వుంటుంది. తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, కండరాల నొప్పి వుంటుంది.
ఈ పురుగు కాటు వేసిన ప్రదేశంలో నల్లగా, చిన్న పుండు లేదా పొక్కు లాంటి గాయం ఏర్పడుతుంది. ఇది నొప్పి లేకుండా ఉంటుంది. చంకలు, గజ్జలు, ఛాతీ, కడుపు వంటి ప్రదేశాలలో ఈ నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇది స్క్రబ్ టైఫస్కు ఒక ముఖ్యమైన సంకేతం. జ్వరం ప్రారంభమైన 5 నుండి 8 రోజుల తర్వాత శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి, ఇవి క్రమంగా చేతులు, కాళ్ళకు వ్యాపిస్తాయి. పురుగు కాటు వేసిన ప్రదేశానికి దగ్గరగా ఉన్న శోషరస గ్రంథులు ఉబ్బుతాయి.
ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు. పొడి దగ్గు, కొన్నిసార్లు న్యుమోనియాగా మారవచ్చు. వికారం, వాంతులు, కడుపు నొప్పి, అలసట, కళ్ళు ఎర్రబడటం కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే, స్క్రబ్ టైఫస్ తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. ఊపిరితిత్తులలో వాపుతో న్యూమోనియాకి దారితీస్తుంది. మల్టీ-ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే.. కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె వంటి బహుళ అవయవ వ్యవస్థలు ప్రభావితమయ్యే ప్రమాదం వుంది. మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న పొరల వాపు కనిపిస్తుంది. చివరికి రోగి కోమాలోకి వెళ్లిపోతాడు.
స్క్రబ్ టైఫస్ వ్యాధిని డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం, దీనివల్ల వేగంగా కోలుకోవచ్చు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.