జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో విధమైన కష్టం వుంటుంది. ఆస్తులుంటే ఆరోగ్యం వుండదు. ఆరోగ్యం వుంటే ఆస్తులుండవు. ఇవన్నీ వుంటే మనశ్శాంతి కొందరికి కరవయ్యే రీతిలో ఇబ్బందులు వుంటాయి. ఈ ఇబ్బందులను నెట్టుకొచ్చే విధంగా వుంటే సరే.. కానీ ఆ ఈతిబాధలతో తీవ్ర ఒత్తిడి, ఇతరత్రా సమస్యలుంటే.. కచ్చితంగా కుమార స్వామిని శరణు వేడుకోవాల్సిందే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
స్కంధ షష్ఠి రోజున కార్తీకేయుడిని నిష్ఠగా పూజించే వారికి సర్వశుభాలు చేకూరుతాయి. ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. స్కంధ షష్ఠి జూలై 30వ తేదీన వస్తోంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన అనుగ్రహం కోరిక తీరుతుందని నమ్మకం.
ఆ రోజున శుచిగా స్నానమాచరించి.. కుమార స్వామిని పూజించాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి యధాశక్తి అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవాలి. ఈ రోజు స్వామికి ఎర్రని పూలు, ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజ గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఆలయాలలో రావిచెట్టు కింద ఉండే నాగప్రతిష్టకు ఈ రోజు సుబ్రహ్మణ్యుని భక్తులు విశేషంగా పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్లు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు.
పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం, భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడితో పాటు ఆదిదంపతులైన శివపార్వతులను కూడా పూజించే సంప్రదాయం ఉంది.