Publish Date: Thu, 25 Mar 2021 (20:31 IST)
Updated Date: Thu, 25 Mar 2021 (20:32 IST)
ప్రదోషమంటే విశిష్టకాలం. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు.
కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. అయితే అన్నిరోజులలో కలిగే ప్రదోషాలపైకి, మూడు ప్రదోషాలకే ప్రాముఖ్యత ఉంది. అవి, చతుర్థి, సప్తమి, త్రయోదశిలలో కలిగే ప్రదోషాలు. వీటిలో కూడా త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని మహా ప్రదోషం అంటారు. అంటే అది శనివారం పూట వస్తుంది.
అలాగే సూర్యాస్తమయ కాలము మనకు తమోగుణ ప్రధానమైనది. ఆ సమయములో ప్రదోషమైతే, కొన్ని అనుష్ఠానములు చేయాల్సి ఉంటుంది. మామూలుగా చతుర్థి, సప్తములలో ధ్యానము, గాయత్రీ జపము చేయవచ్చు. కానీ ప్రదోష సమయముపై శివుడికొక్కడికే అధికారము గలదు. కాబట్టి శివ పూజ మాత్రమే చేయాలి. ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరము. పరమ శివుడు తన ప్రమథగణాలతో కొలువై మన పూజలు అందుకోడానికి సిద్ధంగావుండే సమయమది.
మన పాపకర్మల ఫలాన్ని పటాపంచలు చేసి గరళము వలె మింగి, మనకు సాత్త్విక గుణమును కలిగించి మన కష్టములను తగ్గిస్తాడు. ఈ త్రయోదశి రోజున వచ్చే ఏ ప్రదోషమైనా మహిమాన్వితమైంది. దోషమునాడు ఎవరికి వీలైనంతగా వారు, మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకమో, ఏకవార రుద్రాభిషేకమో, లఘున్యాస నమక చమక పఠనమో, ఉత్తి పాలతో అభిషేకమో, మారేడు దళములతో అర్చననో, ఏదో ఒకటి చేసి అనంత ఫలము పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.