Publish Date: Tue, 30 Nov 2021 (20:12 IST)
Updated Date: Wed, 01 Dec 2021 (20:26 IST)
ప్రదోషము అంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము అనగా చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం. ఈ ప్రదోషం డిసెంబర్ 2వ తేదీన వస్తోంది.
త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. బిల్వ పత్రాలతో కూడిన మాలను సమర్పించవచ్చు. అలాగే నేతి దీపం వెలిగించి.. బియ్యం, బెల్లం నైవేద్యంగా సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
ప్రదోష కాలంలో నటరాజ స్వామిగా శివ స్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలకు విచ్చేస్తారని విశ్వాసం. ఈ కాలంలో శివునిని ఆరాధిస్తే.. సమస్త దేవతలను ఆరాధించినట్లే. నటరాజ స్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోష కాలం, ప్రదోష సమయం అంటారు.
అందుకే నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుడిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రదోష కాలంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పితృదేవలు, ఏడు తరాల వారు చేసిన పాపాలు హరించుకుపోతాయి.