ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. అనేక మంది భర్తలను తమ ప్రియుళ్లతో కలిసి భార్యలు హత్య చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన ప్రియుడుని ఇంటికి పిలిచి భర్తతో కలిసి హత్య చేసింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఈ దారుణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సాంబా జిల్లాకు చెందిన రయూస్ అహ్మద్, సితార దంపతులు. పొరుగింటికి చెందిన 45 ఏళ్ల అనీశ్ను అనే వ్యక్తితో సితారకు వివాహేతర సంబంధం ఉంది. శనివారం రాత్రి అనీశ్ను తన ఇంటికి పిలిపించిన సితార.. అక్కడకు వచ్చిన అతనిపై భర్త రయాస్ అహ్మద్ కలిసి దాడి చేసింది. స్క్రూడ్రైవర్తో పొడిచి, కటింగ్ ప్లేయర్ వంటి పరికరాలతో హింసించింది. తీవ్ర గాయాలతో అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి వచ్చిన అనీశ్ ఆ తర్వాత మరణించాడు.
ఈ ఘటనపై మృతుడు అనీశ్ తండ్రి ముస్తాకిమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొరుగింటి కుటుంబానికి తన కుమారుడు గతంలో ఏడు లక్షలు అప్పు ఇచ్చాడని, ఇటీవల తన కుమారుడికి పెళ్లి కుదరడంతో డబ్బు తిరిగి ఇవ్వమని అడిగేందుకు వెళితే ఆ దంపతులు దారుణంగా హింసించి హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
అనీశ్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, అనీశ్కు సితారతో వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అనీశ్ను తన ఇంటికి పిలిపించిన సితార.. భర్తతో కలిసి హింసించి హత్య చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. అనీశ్ హత్యకు కారకులైన భార్య, భర్తలను అరెస్టు చేసినట్లు చెప్పారు.