Publish Date: Wed, 15 Jan 2020 (09:22 IST)
Updated Date: Wed, 15 Jan 2020 (09:23 IST)
కిలో ఉల్లిపాయలు రూ.22కే ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఉల్లి, కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకడంతో రిటైల్ ద్రవ్యోల్బణం అయిదున్నరేళ్ల గరిష్ఠానికి చేరి ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉల్లి ధరలు తగ్గుతాయని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశవాన్ తెలిపారు. ఇక నుంచి కిలో ఉల్లి రూ.22కే అందిస్తామని ఆయన ప్రకటించారు. ‘18వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకున్నాం. కేవలం 2000 టన్నుల ఉల్లిపాయలు మాత్రమే అమ్ముడుపోయాయి. ఇక కిలో ఉల్లి రూ.22కే అందిస్తాం’ అని ఆయన తెలిపారు.
గతేడాది ఉల్లి ధరలు భారీగా పెరిగి వినియోగదారుల కంట కన్నీరు తెప్పించింది. కొన్ని ప్రాంతాల్లో రూ.100 నుంచి రూ.200 వరకు ఉల్లి ధర పలికింది. ఆ సమయంలో టర్కీ, ఈజిప్ట్, అఫ్గానిస్థాన్ నుంచి 10వేల టన్నులకు పైగా ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నట్లు అప్పట్లో అధికారులు తెలిపారు.
ఉల్లి ధరల పెరుగుదల కారణంగా గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం 7.35గా నమోదైంది. అటు టోకు ద్రవ్యోల్బణం కూడా ఏడు నెలల గరిష్ఠానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉల్లి ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.