Publish Date: Mon, 31 May 2021 (14:51 IST)
Updated Date: Mon, 31 May 2021 (14:57 IST)
కరోనా వైరస్ మహమ్మారి వేళ తల్లిదండ్రులను కల్పోయిన అనాథపిల్లలను ఆదుకునేలా ప్రధాని నరేంద్ర మోడీ పది లక్షల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. అక్కరకురాని సాయం ఎందుకు అంటూ కౌంటర్ ఇచ్చారు.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సాయం అవసరమైన వేళ.. ప్రధాని మోడీ సర్కారు కేవలం హామీలతో సరిపుచ్చిందంటూ ఆయన తప్పుబట్టారు. 'మోడీ సర్కారు మరో మాస్టర్ స్ట్రోక్ ఇది. ఈసారి కరోనా వల్ల అనాథలైన పిల్లలను ఆదుకోవడంలో అసమర్థత. ఇప్పుడు వారు తమకు అత్యంత అవసరమైన సాయాన్ని అందుకోవడానికి బదులు.. 18 ఏళ్ల తర్వాత స్టైపెండ్ అందుతుందనే హామీ గురించి పాజిటివ్గా ఫీల్ అవ్వాలి' అని ఆయన వ్యాఖ్యానించారు.
పైగా, కృతజ్ఞత కలిగి ఉండండి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పీఎం కేర్స్ సాయానికి సంబంధించి శనివారం విడుదలైన పత్రికా ప్రకటనను ఆయన ప్రస్తావించారు. కేంద్రం ప్రకటించిన మేరకు కరోనా రెండో దశ వ్యాప్తిలో గత వారం వరకు 577 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయారు. మరి అంతకంటే ముందే అనేక మంది అనాథలుగా మారారని, వారి పరిస్థితి ఏంటి అంటూ ఆయన ట్వీట్ రూపంలో ప్రశ్నించారు.