ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలకు సంబంధించి గత మూడేళ్లకాలంలో రూ.295 కోట్లు ఖర్చయిందని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇందులో మోడీ విదేశీ పర్యటనకలకు సంబంధించి ఏ దేశానికి వెళ్లినపుడు ఎంత ఖర్చయిందన్న వివరాలను ఆయన వెల్లడించారు.
2021 నుంచి 2024 మధ్య కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు రూ.295 కోట్లు వెచ్చించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో ఒక్క ఫ్రాన్స్ పర్యటనకే రూ.25 కోట్లు ఖర్చయిందని వివరించారు. 2023 జూన్ నెలలో మోడీ అమెరికా ప్యటనకు రూ.22 కోట్లు ఖర్చయిందన్నారు. ఇటీవల మోడీ ఐదు దేశాలలో పర్యటించగా దీనికోసం రూ.67 కోట్లు ఖర్చయిందని తెలిపారు. ఈ యేడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ మరాషెస్, సైప్రెస్, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించారు. అయితే, ఈ దేశాలకు సంబంధించిన ఖర్చులను మాత్రం ఆయన వెల్లడించక పోవడం గమనార్హం.