Publish Date: Wed, 17 Jun 2020 (09:56 IST)
Updated Date: Wed, 17 Jun 2020 (09:57 IST)
దేశ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. అదను చూసి దెబ్బ కొడుతోంది. ఒకవైపు లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన ప్రజలపై ప్రతిరోజూ పెట్రోధరల భారాన్ని పెంచుకుంటూ పోతోంది. వరుసగా పదకొండు రోజుల నుండి కేంద్రం పెట్రోల్ ధరలను పెంచుతోంది.
తాజాగా నేడు పెట్రోలుపై 55 పైసలు, డీజిల్పై 60 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో గత 11 రోజుల్లో పెట్రోలుపై రూ.6.02 పైసలు, డీజిల్పై రూ. 6.40 పెరిగింది. దీంతో హైదరాబాద్లోనూ లీటర్ పెట్రోల్ ధరలు రూ. 80 దాటి రూ. 80.22కు చేరుకోగా, డీజిల్ధర 74.07కు చేరింది.
ఎపి రాజధాని అమరావతిలో లీటరు పెట్రోలు ధర హైదరాబాద్ కంటే ఎక్కువగా రూ.80.66గా ఉండగా, డీజిల్ ధర రూ. 74.54గా ఉంది. ఇక, ఢిల్లీలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ. 77.28, రూ.75.79గా నమోదు కాగా, చెన్నైలో రూ. 80.86, రూ.73.69కి పెరిగాయి.
ముంబయిలో పెట్రోల్ ధర రూ.84.15 కాగా, డీజిల్ ధర రూ. 74.32కి చేరింది. కరోనా లాక్డౌన్తో కుదేలవుతున్న ప్రజలపై పెట్రోల్ ధరల పెరుగుదల మరింత భారం కానుంది.