Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడో డోసు ట్రయల్స్‌కు అనుమతి

Advertiesment
Permission
, శనివారం, 3 ఏప్రియల్ 2021 (09:19 IST)
భారత్‌లో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొవిడ్‌ టీకాలను రెండు డోసుల్లో ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ టీకాల వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఎంతకాలం ఉంటాయనే దానిపై స్పష్టత లేదు.

దీంతో మూడో డోసు (బూస్టర్ డోసు) అవసరం ఎంతైనా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌కు 'బూస్టర్‌ డోస్‌' ప్రతిపాదించింది.

తాజాగా ఈ 'బూస్టర్‌ డోస్‌' క్లినికల్‌ ట్రయల్స్‌కు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో కొవాగ్జిన్‌ మూడో డోసుపై ప్రయోగాలు మొదలుకానున్నాయి.
 
కొవాగ్జిన్‌ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవడం కోసం రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనల్లో మార్పు చేయాలని కోరుతూ భారత్‌ బయోటెక్‌ సంస్థ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) నిపుణుల కమిటీకి కొన్ని సవరణలను ప్రతిపాదించింది.

వీటిపై సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత 6ఎంసీజీ మోతాదులో ప్రయోగాలను కొనసాగించవచ్చని డీసీజీఐ నిపుణుల కమిటీ అనుమతిచ్చింది. మూడో డోసు ఇచ్చిన తర్వాత ఆరు నెలల పాటు కమిటీ సిఫార్సులను పాటించాలని భారత్‌ బయోటెక్‌కు సూచించింది.

అంతేకాకుండా ప్రయోగాల ఫ్రాథమిక, ద్వితీయ లక్ష్యాల వివరాలను కూడా కమిటీకి అందించాలని భారత్‌ బయోటెక్‌ను కోరింది. మార్చి 23వ తేదీన జరిగిన నిపుణుల కమిటీ భేటీలో బూస్టర్‌ డోసుకు సంబంధించిన క్లినికల్‌ ట్రయల్స్‌ నిబంధనల్లో మార్పులు, ప్రయోగాల లక్ష్యాలపై భారత్‌ బయోటెక్‌తో సుదీర్ఘంగా చర్చించింది.

ఈ బూస్టర్‌ డోసు ప్రయోగాల్లో.. రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్లకు రెండో డోసు తీసుకున్న ఆరు నెలల గడువు తర్వాత మూడో డోసు ఇచ్చి పరీక్షిస్తారు.
 
భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్‌' టీకా 81శాతం సమర్థత కనబరిచినట్లు తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. సుమారు 25,800 మంది వాలంటీర్లపై నిర్వహించిన ప్రయోగాల్లో 'కొవాగ్జిన్‌' టీకా సురక్షితమని తేలినట్లు భారత్‌ బయోటెక్‌ మార్చి నెలలో ప్రకటించింది.

ఇక కొత్తగా వెలుగుచూసిన కొత్త రకాలపైనా కొవాగ్జిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. ఇదిలాఉంటే, భారత్‌లో తయారవుతోన్న టీకాలు సమర్థత కలిగినవి, అత్యంత సురక్షితమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ మరోసారి స్పష్టంచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్టోపస్‌కు కోపం వచ్చింది.. ఏం చేసిందో తెలుసా? (video)