కేరళలో గర్భంతో వున్న ఏనుగును చంపేసిన ఘటన పెను దుమారం రేపింది. గర్భంతో వున్న ఏనుగుకు పటాసులు వున్న ఫైనాపిల్ తినిపించి చంపేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ ఘటన మన దేశ సంస్కృతికి అద్దం పట్టదని ట్విట్టర్ ద్వారా ప్రకాశ్ జవదేకర్ ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై యావత్తు దేశం స్పందించింది. గర్భంతో ఉన్న మూగజీవాన్ని చంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కూడా అలాగే చంపాలంటూ కొందరు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. 
 
									
										
								
																	
	 
	వివరాల్లోకి వెళితే... కేరళలోని మల్లాపురంలోకి గర్భంతో ఉన్న ఏనుగు రావడంతో కొందరు ఆకతాయిలు దుర్మార్గంగా ఆలోచించి క్రాకర్లను ఓ పైనాపిల్లో కుక్కి నిప్పు పెట్టారు. దాన్ని ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్లు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు... ఆ పైనాపిల్ను నోట్లోకి తీసుకుంది. అంతే.. భారీ శబ్ధంతో పేలింది. ఏనుగు నోరు, నాలుక పూర్తిగా దెబ్బతింది.  నాశనమైంది. అప్పటికే ఆ ఏనుగు పొట్టలో 18 నెలల గున్న ఏనుగు కూడా ఉంది.
 
									
											
									
			        							
								
																	
	 
	కాలిన నోటితో ఆ ఏనుగు కేకలు పెడుతూ... ఊరి సందుల్లో అటూ ఇటూ తిరిగింది. ఏదీ తినలేకపోయింది. గాయాల నొప్పి, బాధతో ఆ ఏనుగు చివరకు వెల్లియార్ నదిలోకి వెళ్లింది. అక్కడ నీరు తాగింది. ఆ తర్వాత నదిలోనే నిల్చొని చనిపోయింది.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	ఈ ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటా స్పందిస్తూ.. అమాయక ఏనుగును క్రూరంగా అంతమొందించిన ఘటన తనని కలచివేసిందన్నారు. అమాయక జంతువుల హత్యను సాటి మనుషుల హత్యగానే పరిగణించాలని పేర్కొన్నారు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	ఇక క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రణ్దీప్ హుడా, తెలుగు నటి ప్రణీత డిమాండ్ చేశారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపితే రూ. 50 వేలు ఇస్తామని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా బహుమతి ప్రకటించింది.