Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ఐఏ విస్తృత సోదాలు..

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ఐఏ విస్తృత సోదాలు..
, ఆదివారం, 8 ఆగస్టు 2021 (09:18 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. 
 
ఇందులోభాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే జమ్ముకశ్మీర్‌లోని 14 జిల్లాల్లో 45 ప్రాంతాల్లో సోదాలు ప్రారంభించింది. ఎన్‌ఐఏ, సీఆర్‌పీఎఫ్‌, జమ్మూకాశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా నిషేధిత జమాతే ఈ ఇస్లామి సంస్థకు చెందిన సభ్యుల ఇండ్లపై దాడులు నిర్వహించారు. 
 
సంస్థపై నిషేధం తర్వాత దాని సభ్యుల కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. వేర్పాటువాద, పాకిస్థాన్‌ అనుకూల సంస్థ అయిన జమాతే-ఇ-ఇస్లామిపై కేంద్ర ప్రభుత్వం 2019లో నిషేధం విధించింది. కానీ, ఈ సంస్థకు ఉగ్రవాదులు భారీగా నిధులు సమకూర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
 
సీనియర్‌ డీఐజీ నేతృత్వంలో ఢిల్లీ నుంచి వెళ్లిన ఎన్‌ఐఏ బృందం కాశ్మీర్‌లోని శ్రీనగర్‌, బుద్గాం, గండర్‌బాల్‌, బారాముల్లా, కుప్వారా, బందిపోరా, అనంత్‌నాగ్‌, షోపియాన్‌, పుల్వామా, కుల్గాం, రామ్‌బన్‌, దోడా, కిష్ట్‌వార్‌, రాజౌరీ జిల్లాల్లో దాడులు నిర్వహిస్తున్నది. 
 
గత నెల 31న కూడా కేంద్రపాలిత ప్రాంతంలోని 14 చోట్ల సోదాలు చేపట్టింది. లష్కర్-ఇ-ముస్తాఫా చీఫ్ హిదయాతుల్లా అరెస్టు నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించింది. పుల్వామా, సోఫియాన్, శ్రీనగర్, అనంతనాగ్, జమ్ము, బనిహాల్ ఏరియాల్లో సోదాలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణిగుంటలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణం