Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

వివాదాస్పద వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం
, ఆదివారం, 20 సెప్టెంబరు 2020 (15:03 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద మూడు వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆదివారం మూజువాణి ఓటుతో ఆమోదముద్రవేసింది. అంతకుముందు సభలో రైతులకు నష్టం చేకూర్చేలా బిల్లు ఉందంటూ విపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. దాదాపు 14 విపక్ష పార్టీలు ముక్త కంఠంతో బిల్లును వ్యతిరేకించాయి. కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సభలో బిల్లులను ప్రవేశపెట్టిన వెంటనే విపక్ష సభ్యులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బిల్లుపై రచ్చ జరిగింది.
 
కొందరు బిల్లుల ప్రతులను చింపేసి విసిరేశారు. మరికొందరు డిప్యూటీ చైర్మన్ మైక్‌ను లాగేందుకు ప్రయత్నించారు. గందరగోళం మధ్య సభను డిప్యూటీ చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోద ముద్రవేశారు. అనంతరం సభను సోమవారాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఇదిలావుండగా, కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును రాజ్యసభలో తెరాస ఎంపీలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పక్షనేత, ఎంపీ కేశవరావు మాట్లాడారు. కొత్త వ్యవసాయ బిల్లుతో రైతులను తీరని నష్టం జరిగే అవకాశముందని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం బిల్లును రూపొందించిందని ఆక్షేపించారు. రైతులకు అండగా లేని ఇలాంటి చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
 
వ్యవసాయ రంగంలోనూ కార్పొరేట్లను పెంచి పోషించేలా.. మార్కెటింగ్‌ ఏజెంట్లకు సైతం నష్టం కలిగించేలా ఈ కొత్త చట్టం ఉందని పేర్కొన్నారు. కేంద్రం ఏ పథకానికి సక్రమంగా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. మరోవైపు, ఈ బిల్లులకు టీడీపీ, వైకాపాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్పొరేట్ శక్తులకు రైతులు బానిసలా? రాహుల్ గాంధీ