పాకిస్థాన్కు భారత్ మరో షాకిచ్చింది. దాయాది దేశం నుంచి వచ్చే అన్ని రకాల పార్శిళ్లు, మెయిల్స్ మార్పిడిని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాయు మార్గం లేదా ఉపరితల మార్గం ద్వారా వచ్చినా ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జరిగే అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెల్సిందే. తాజాగా తీసుకున్న మెయిల్స్, పార్శిళ్ళ నిలిపివేతపై నిర్ణయం ఈ ఆంక్షల పరంపరలో ఒకటిగా చెప్పొచ్చు.
అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య సముద్ర మార్గ రవాణాను కూడా భారత్ మూసివేసింది. పాకిస్థాన్ జెండాతో ప్రయాణించే ఏ నౌక అయినా భారత్ ఓడరేవుల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించారు. అదేసమయంలో భారతీయ నౌకలు కూడా పాకిస్థాన్ ఓడరేవులకు వెళ్లకూడని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఆంక్షలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది.
కాగా, పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది. వీటితో పాటు పాకిస్థాన్కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని కూడా పరిమితం చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వీటిపై కూడా ఆంక్షలు విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది పర్యాటకులను కాల్చివేసిన విషయం తెల్సిందే. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయంతెల్సిందే.