దాయాది దేశం పాకిస్థాన్కు భయంపట్టుకుంది. భారత్ మరో 36 గంటల్లో మా దేశంపై దాడి చేయొచ్చని, అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తోందని పాకిస్థాన్ మంత్రి సమాచార మంత్రి అతవుల్లా తరార్ వ్యాఖ్యానించారు. వచ్చే 24-36 గంటలు ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన తమకు ఖచ్చితమైన నిఘా వర్గాల సమాచారం ఉందని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన వేళ పాక్ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యలపై పాక్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే ఆయన న్యూఢిల్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ ఆయన మరోమారు మొసలి కన్నీరుకార్చారు. పహల్గాం దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు. అయినా సరే భారత్ తమపై సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆరోపించారు. దీనికి తమ నుంచి ప్రతిచర్య కూడా తీవ్రంగా ఉంటుందంటూ పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంగళవారం తన నివాసంలో జరిగిన అత్యున్నతస్థాయి రక్షణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెల్సిందే. సీమాంతర ఉగ్రవాదం దాని సూత్రధారులపై చర్యలు ఎపుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం అని మోడీ స్పష్టం చేసినట్టు విశ్వనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాకిస్థాన్కు భయం పట్టుకుంది. భారత త్రివధ దళాలు ఏ క్షణమైనా తన దేశంపై దాడి చేసే అవకాశం ఉందని వణికిపోతోంది.