Publish Date: Thu, 26 Sep 2019 (07:30 IST)
Updated Date: Thu, 26 Sep 2019 (07:32 IST)
మధ్యప్రదేశ్లో గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేసినందుకు ఇద్దరు చిన్నారులపై స్థానికులు మూకదాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మధ్యప్రదేశ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారనే నెపంతో ఇద్దరు ఎస్సీ బాలలపై మూకదాడికి దిగారు గ్రామస్థులు. శివ్పుర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
శివ్పుర్ జిల్లా భావ్కేది గ్రామానికి చెందిన రోషనీ(12), అవినాశ్ (10) అనే ఇద్దరు చిన్నారులు.. ఇవాళ ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ భవనం ముందు మలవిసర్జన చేశారు. అది గమనించిన గ్రామస్థులు వారిపై కన్నెర్ర చేశారు.
చిన్నపిల్లలని కూడా చూడకుండా కర్కశంగా మూక దాడి చేశారు. ఆ చిన్నారులను తీవ్రస్థాయిలో గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని.. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు ఒడిగట్టిన నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.