హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఎంతో సంతోషంగా పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారంతా ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి భాక్రా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలతో పాటు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఫజిల్కా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో హాజరైన 14 మంది తిరిగి శుక్రవార రాత్రి పొద్దుపోయాక ఓ జీపులో ఇంటికి తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఐదుగురు మహిళలు, 11 యేళ్ల బాలిక ఉన్నారు.
మంచు దుప్పటి కప్పేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికి తీశారు. మృతులంతా బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.