Publish Date: Mon, 16 May 2022 (13:42 IST)
Updated Date: Mon, 16 May 2022 (14:02 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. మొత్తం ఆరు జిల్లాల్లో వరద నీరు పోటెత్తడంతో వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. దాదాపు 24 వేల మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్టు అధికారులు చెపుతున్నారు.
ఈ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వరద ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొన్ని జిల్లాల్లో దుకాణాలు, గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరద ధాటికి ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ వరదలు అస్సాం రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.
పలు జిల్లాల్లో వరద నీరు పొంగి పొర్లుతున్నాయి. వరద ధాటికి పలు ప్రాంతాల్లో రైలు కట్టలు దెబ్బతిన్నాయి. దీంతో అస్సాంకు వెళ్లే అనేక రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.