Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫాస్టాగ్ లేకుంటే రెట్టింపు చార్జీలు బాదుడు.. నేటి అర్థరాత్రి నుంచి అమలు...

ఫాస్టాగ్ లేకుంటే రెట్టింపు చార్జీలు బాదుడు.. నేటి అర్థరాత్రి నుంచి అమలు...
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (08:07 IST)
కేంద్ర ప్రభుత్వం మరోమారు కఠినమైన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. జాతీయ రహదారులపై నిర్మించిన టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ లేకుండా చేసేందుకు ఫాస్టాగ్ నిబంధనను పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. ఈ నిబంధన దేశవ్యాప్తంగా సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకిరానుంది. 
 
అంటే.. మంగళవారం నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులపై టోల్‌గేట్లు దాటాలంటే.. ఫాస్టాగ్‌ తప్పనిసరి. ఒకవేళ ఫాస్టాగ్‌ లేకుంటే.. రెట్టింపు టోల్‌ చెల్లించాల్సిందే. పైగా.. 24 గంటల్లోనే తిరుగు ప్రయాణమైతే ఇచ్చే సగం రాయితీ కూడా లభించదు. 
 
ఉదాహరణకు రూ.100 టోల్‌‌టాక్స్‌ ఉంటే.. 24 గంటల్లో తిరుగు ప్రయాణమయ్యేవారికి ఫాస్టాగ్‌తో రానుపోను మొత్తం రూ.150తో సరిపోతుంది. అదే ఫాస్టాగ్‌ లేని వాహనాలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. నిజానికి ఈ ఏడాది జనవరి 1 నుంచే ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినా.. దాన్ని ఈ నెల 15కు పొడిగించింది. ఇంతకుముందు ప్రతి టోల్‌ప్లాజా వద్ద ఒక లేన్‌ను నగదు చెల్లింపుల కోసం కేటాయించేవారు.
 
మంగళవారం నుంచి అన్నీ ఫాస్టాగ్‌ లేన్లే ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలోని జాతీయ రహదారులపై 21 టోల్‌ప్లాజాలున్నాయి. ఫాస్టాగ్‌ గడువును ఇక పొడిగించేది లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌లో స్పష్టం చేశారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, ఇక అవకాశాలివ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాల్లో ఇప్పటికే 90శాతం ఫాస్టాగ్‌ను వాడుతున్నాయని, మిగతా 10 శాతం వాహనాలకు సోమవారం నుంచి ఫాస్టాగ్‌ తప్పనిసరి అని చెప్పారు. 
 
ఫాస్టాగ్‌ ఎక్కడ కొనాలి?
 
* జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఇప్పుడు ఫాస్టాగ్‌ విక్రయాలకు తాత్కాలిక కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వాహనదారులు తమ వాహనం వివరాలు అందజేసి, ఫాస్టాగ్‌ను తీసుకోవచ్చు.
 
* ఆన్‌లైన్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు, ఫోన్‌పే వంటి మనీ వ్యాలెట్‌ సంస్థ కూడా ఫాస్టాగ్‌ విక్రయాలు జరుపుతున్నాయి. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌, బీవోబీ, హెచ్‌డీఎ్‌ఫసీ వంటి 21 గుర్తింపు పొందిన బ్యాంకులు వీటిని అందజేస్తున్నాయి. ఆయా బ్యాంకు బ్రాంచీల్లో ఆఫ్‌లైన్‌లో.. లేదా ఆయా బ్యాంకుల యాప్‌లలో ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయవచ్చు
 
* ఫాస్టాగ్‌లో కనీస నగదు నిల్వ ఉండాలనే నిబంధనను కేంద్రం ఎత్తివేసింది. అయితే.. నగదు నిల్వలు లేకుండా ఫాస్టాగ్‌ను వాడితే.. దానంతట అదే బ్లాక్‌లిస్టులోకి మారిపోతుంది. వాహనదారుడు రెట్టింపు టోల్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరు? ఎన్వీ రమణకు ఛాన్స్ దక్కదా?