ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే తన ప్లాన్ అని ఈ కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు సక్రియా రాజేష్ భాయ్ ఖిమ్జీ (41) వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నిర్వహించిన ప్రజాదర్బార్లో సక్రియా రాజేష్ భాయ్ దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ దాడిలో ఢిల్లీ సీఎం స్వల్పంగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. అతనివద్ద జరిపిన విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎం రేఖాగుప్తాను కత్తితో పొడవాలని నిందితుడు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అయితే భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు సక్రియా చెప్పినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ వీధి కుక్కలను తరలించాలని నేను చాలాసార్లు అభ్యర్థించా. దీని గురించి సీఎం పట్టించుకోకపోవడంతోనే ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా. సీఎం అధికారిక నివాసానికి వెళ్లడానికి ముందు సుప్రీంకోర్టుకు వెళ్లా. న్యాయస్థానం బయట సెక్యూరిటీని చూసి అక్కడి నుంచి వచ్చేశా. అనంతరం సివిల్ లైన్స్లో సీఎం కార్యాలయానికి వెళ్లా. తొలుత ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్ చేశా. కానీ, భద్రత ఎక్కువగా ఉండటం చూసి కత్తిని బయటే పడేశా అని నిందితుడు సక్రియా విచారణలో చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆగస్టు 20న సివిల్ లైన్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖా గుప్తా, 'జన్ సున్వాయ్” కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన దుండగుడు... పత్రాలను అందిస్తూ.. సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. పెద్దగా కేకలు వేస్తూ.. చెంపదెబ్బ కొట్టాడు. ఆమెను వెనక్కి తోసేయడానికి ప్రయత్నించాడు. ఆమె జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. తక్షణమే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అనూహ్య ఘటనలో ముఖ్యమంత్రి తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి. కాగా, ఈ ఘటనలో మరో నిందితుడు తహసీన్ సయ్యద్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.