Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పల్లెలపై కరోనా పంజా?

పల్లెలపై కరోనా పంజా?
, శనివారం, 6 జూన్ 2020 (11:35 IST)
గ్రామీణ భారతం కరోనా కబంధ హస్తాల్లోకి జారుతున్నది. ఇంతకాలం జనసాంద్రత అధికంగా ఉన్న నగరాలు, పట్టణాల్లోనే ప్రతాపం చూపించిన కొవిడ్‌-19 ఇప్పుడు గ్రామసీమలను కమ్ముకుంటున్నది.

లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి సొంతూర్లకు చేరుతున్న వలస కూలీలు కరోనాను కూడావెంటతీసుకెళ్తున్నారు. దాంతో స్వచ్ఛమూ సురక్షితమూ అని భావించిన పల్లెల్లో ఇప్పుడు స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతున్నది. కలో గంజో తాగి కాలమీడుద్ధామనుకున్న పల్లె జనాలు కరోనాతో కకావికలమవుతున్నారు.
 
దేశంలో కరోనా కేసులు వందలు దాటి వేలల్లోకి చేరుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా నిలుస్తున్నది. గత 15 రోజులుగా కరోనా హాట్‌జోన్లలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నది.

మే మధ్యవరకు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు పల్లెల్లో వేగంగా విస్తరిస్తున్నది. లాక్‌డౌన్‌ సడలింపులతో నగరాల నుంచి లక్షల మంది వలస కార్మికులు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. వీరు అత్యధికులు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ర్టాల వారే. పనుల్లేక కష్టాలుపడుతున్న కార్మికులను ఆయా రాష్ర్టాలు ప్రత్యేక రైళ్లు, బస్సుల ద్వారా సొంత గ్రామాలకు తరలించాయి.

కార్మికుల కష్టాలు చూడలేక తెలంగాణ కూడా సొంత ఖర్చులతో ప్రత్యేక రైళ్లద్వారా వేలమందిని వారి స్వస్థలాలకు తరలించింది. అంత కుముందే కొంతమంది నడుచుకుంటూ సొంత గ్రామాలకెళ్లిపోయారు.  వారు స్వస్థలాలకు చేరుకున్న తర్వాత నిర్వహిస్తున్న పరీక్షల్లో వందల కేసులు బయటపడుతున్నాయి.
 
దక్షిణాదిలోనూ కరోనా గ్రామాల్లోకి విస్తరిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడువారాల్లో 1500 కేసులు నమోదుకాగా, అందులో 500 కేసులు గ్రామాల్లోనే వెలుగులోకి వచ్చాయి. కేరళలో కూడా.. కాసరగోడ్‌ జిల్లాలో 112, పాలక్కడ్‌లో 144 కేసులు నమోదయ్యాయి.
 
కరోనా హాట్‌బెడ్లుగా మారిన పల్లెలు ఉత్తర భారతంలోనే అధికం. రాజస్థాన్‌లోని పాజిటివ్‌ కేసుల్లో 30% గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దుంగార్పూర్‌, జలోర్‌, జోధ్‌పూర్‌, నగౌర్‌, పాలి జిల్లాలు రెడ్‌జోన్లుగా మారాయి. ఒడిశాలో ప్రస్తుతం 80% కరోనా కేసులు గ్రామాల్లోనే నమోదవుతున్నాయి.

ఈ రాష్ర్టానికి దేశం నలుమూలల నుంచి ఇప్పటివరకు వచ్చిన 4.5 లక్షల మంది వలసకూలీల్లో 80శాతానికిపైగా 11 గ్రామీణ జిల్లాలవారే. ఇప్పుడు అక్కడే కేసులెక్కువ. మే 2 వరకు గంజాంలో ఒక్క కేసు కూడా లేదు. కానీ ఇప్పుడు అత్యధికంగా 499 కేసులు ఆ జిల్లాలోనే ఉన్నాయి.

కరోనా భయంతో చాలాచోట్ల్ల వలస కార్మికులను ఊళ్లలోకి రానివ్వకపోవడంతో ఊరి పొలిమేరల్లో  చాలామంది బతుకుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో మార్చిలో కేసులు కేవలం కోల్‌కతాలోనే నమోదయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర రాజధానికి సుదూరంగా ఉన్న మాల్దా, ఉత్తర మిడ్నాపూర్‌, దక్షిణ మిడ్నాపూర్‌, హూగ్లీ, కూచ్‌బిహార్‌ జిల్లాల్లోనే ఎక్కువగా విస్తరిస్తున్నది.

ఈ రాష్ర్టానికి ఇటీవల 6 లక్షలమంది వలస కూలీలు చేరుకోవటంతో వైరస్‌ గ్రామాల్లోకి పాకింది. బీహార్‌లో జూన్‌ 2 నాటికి 4,049 కేసులు నమోదుకాగా, అందులో మే 3 తర్వాత రాష్ర్టానికొచ్చిన కూలీలే 2,905 మంది. రాష్ట్రంలో ప్రస్తు తం 70%  కేసులు వలస కూలీలవేనని, వారంతా గ్రామీణులే. బీహార్‌కు ఇటీవల శ్రామిక్‌ రైళ్లలో 20లక్షల మంది కార్మికులు చేరుకున్నారు.

మరో 2లక్షల మంది రోడ్డు మార్గంలో వచ్చారు. వీరిలో ఇంకెంతమందికి వ్యాధి సోకిందోనని ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మే 1న గ్రామాల్లో కేసులు 8 ఉండగా, జూన్‌ ప్రారంభం నాటికి 464కు చేరుకుంటే.. ఇప్పుడు 90% కేసులు గ్రామాల్లోనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలించాక ఉత్తరప్రదేశ్‌కు 30లక్షల మంది కార్మికులు చేరుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,324 యాక్టివ్‌ కేసుల్లో 70% గ్రామాల్లోనే ఉన్నాయి. 
 
పనుల్లేక సొంతూర్లకు వెళ్లిపోయిన కార్మికులను వెనక్కు తీసుకురావటానికి పలు రాష్ర్టాలు అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. చెన్నైకి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బీహార్‌ నుంచి 150 మంది కార్మికులను తీసుకొచ్చేందుకు ఓ విమానాన్నే బుక్‌చేసింది.

వలస కూలీలపైనే ఆధారపడి వ్యవసాయం చేసే పంజాబ్‌లో తిరిగి వారిని తీసుకొచ్చేందుకు రైతులు రెట్టింపు వేతనాలు ఇవ్వజూపుతున్నారు. హర్యానా తదితర రాష్ర్టాల్లో చిన్నచిన్న వ్యాపారులూ కార్మికులకు కార్లు, బస్సులు బుక్‌చేస్తున్నారు.

తిరిగివచ్చే కార్మికుల కోసం కేరళ ఏకంగా ఓ ఆరోగ్యబీమా పథకాన్నే ప్రకటించింది. ముంబైలో భవన నిర్మాణ కంపెనీలు కార్మికుల ఉద్యోగ భద్రత, రక్షణకు సంపూర్ణ హామీ ఇస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోర్టుల చుట్టూ తిరగటమే అభివృద్దా?: వైసీపీకి సీపీఐ సూటి ప్రశ్న