Publish Date: Thu, 21 Apr 2022 (11:15 IST)
Updated Date: Thu, 21 Apr 2022 (11:25 IST)
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వచ్చారు. ఆయన లండన్ నుంచి భారత్కు ప్రత్యేక విమానంలో వచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానం ల్యాండ్ కాగా, బ్రిటన్ ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి హోదాలో బోరిస్ జాన్సన్ తొలిసారి భారత్ పర్యటనకు వచ్చారు.
ఈ పర్యటనలో ఆయన భారత పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలతో కీలక సమావేశం నిర్వహిస్తారు. అలాగే, ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆయన భారత ప్రభుత్వంతో చర్చిస్తారు. పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పనపై, పలు అంశాల్లో కలిసి పనిచేయడంపై చర్చలు జరుపుతారు.
మరోవైపు, బోరిస్ జాన్సన్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్లో ఆయనకు సంబంధించిన కటౌట్లు ఏర్పాటు చేశారు. గురువారం ఆయం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు.
అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశం అవుతారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో బోరిస్ జాన్సన్ భారత్లో పర్యటిస్తుండడంతో ఆయన పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.