కర్నాటక రాష్ట్రంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటుపడింది. పార్టీ నియమాలను ఉల్లంఘించారనే కారణతో బీజేపీ అధిష్టానం వారిపై వేటు వేసింది. ఎమ్మెల్యేలు ఎస్టీ సోమశేఖర్, ఎ.శివరామ్ హెబ్బర్లను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీకి చెందిన కేంద్ర క్రమశిక్షణ కమిటీ తెలిపింది.
ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రోజు వరకు వాళ్లు పార్టీకి సంబంధించిన ఏ పదవిలో ఉన్నా ఆ పదవులన్నింటి నుంచి తొలిగిస్తున్నట్టు పేర్కొంది. పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ కార్యదర్శి ఓ పాఠక్ జారీ చేసిన లేఖలో ఈ యేడాది మార్చి 25వ తేదీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు.
ఆ నోటీసులకు వారు సమాధానాలు ఇచ్చారని, అయితే వారి వివరణలు అసంతృప్తిగా లేవని కమిటీ భావించి, తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారని, దానిపై షోకాజ్ నోటీసు ఇచ్చినా వారి నుంచి సంతృప్తికర సమధానం రాలేదని, అందుకే ఆ ఇద్దరిపై బహిష్కరణ వేటు వేశామని పేర్కొన్నారు.
కాగా, ఈ బహిష్కరణపై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించరాు. బీజేపీ కమిటీ చేపట్టిన క్రమశిక్షణా చర్యను ఆయన తప్పుబట్టారు. ఇక సోమశేఖర్ యశ్వంత్పూర్, హెబ్బార్ యల్లాపూర్ అసెంబ్లీ నియోజగవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.